శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం “గమనం”. ఈ సినిమాతో సుజనా రావు అనే మహిళ దర్శకురాలిగా పరిచయం అయ్యారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రియ వివాహం చేసుకుని… ఓ బిడ్డకు తల్లి అయిన తర్వాత నటించిన ఈ చిత్రంతో ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ అల్లుకున్న కతే గమనం. ఇది హైదరాబాద్ మహానగరంలో మూడు ఏరియాల్లో జరిగే కథ. కమల(శ్రియ సరన్) ఓ దివ్యంగురాలు. వినికిడి లోపంతో ఇబ్బందిపడుతూ… దర్జీ పని చేస్తూ తన చిన్నారిని పోషించుకుంటూ వుంటుంది. తనకు వినికిడి లోపం ఉందని… భర్త కూడా వదిలేస్తాడు. దాంతో నిస్సహాయురాలిగా ఓ బస్తీలో జీవిస్తూ ఉంటుంది. అలాగే అలీ(శివ కందుకూరి) ఎలాగైనా మంచి క్రికెటర్ కావాలని పట్టుదలతో ప్రాక్టీసు చేస్తుంటాడు. తనని జరా(ప్రియాంక జవాల్కర్) ప్రేమిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళ ప్రేమను పెద్దలు ఒప్పుకోరు. దాంతో జరా అలీ కోసం ఇంట్లో నుంచి పారిపోయి.. వచ్చేస్తుంది. అలాగే… ఓ ఇద్దరు వీధి బాలురు గుజరీ సామాను అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. అయితే వారిలో ఒకరు తన బర్త్ డే కి కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలెబ్రెట్ చేయాలనుకుంటాడు. అందుకు కావాల్సిన డబ్బును పోగు వేయడానికి వివిధ రకాలుగా కష్టపడుతుంటారు. ఇలా ఈ మూడు పాత్రలు నగరంలో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకుంటారు. ఆ వరదల్లో నుంచి వీళ్ళు ఎలా బయట పడ్డారు? అలీ, జరా పెళ్లి చేసుకున్నారా? వీధి బాలుడు పుట్టినరోజును గ్రాండ్ గా సెలెబ్రెట్ చేసుకున్నాడా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణ, ప్రయాణం గురించి చెప్పేదే ‘గమనం’. మనల్ని మనం తెలుసుకునేలా చేసే కథే గమనం. నిస్సహాయతతో ఉండే మనిషికి ఒక్కసారిగా బలం వస్తే వాటిని ఎలా జయించారనేది “గమనం”. ఇలా మూడు నిస్సహాయ పాత్రల చుట్టూ అల్లుకున్న కథ.. కథనాలు.. గమనాన్ని ప్రేక్షకులను హత్తుకునేలా చేస్తాయి. భర్త చేతిలో మోసపోయి… నిరాదరణకు గురైన ఓ దివ్యంగురాలి పాత్ర… ఆటతోనే తన కెరీర్ ను ఉన్నత శిఖరాలకు చేర్చుకోవాలనే ఓ పట్టుదల ఉన్న యువకుని పాత్ర… పేదరికంలో మగ్గిపోయే ఇద్దరు వీధి బాలల పాత్ర… అన్నీ ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. ప్రతి జీవి.. జీవితంలో ఎదురయ్యే ఆటు పోట్లను ఎదుర్కొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఓ స్ఫూర్తి దాయక “గమనం” చూపించారు డెబ్యూ దర్శకురాలు సుజనా రావు.
వినికిడి లోపం ఉన్న దివ్యంగురాలి పాత్రలో శ్రియ అభినయం అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు తన గ్లామర్ తోనే ఆడియన్స్ ని అలరించిన ఈ అందాల బ్యూటీ… ఇప్పుడు అభినయంతో అలరించింది. ముఖ్యంగా క్లయిమాక్స్ సీన్ లో చాలా బాగా నటించింది. యువ హీరో శివ కందుకూరి…. మంచి క్రికెటర్ అయ్యి… అంతర్జాతీయ ఆటగాడిగా గుర్తింపు పొందాలనే క్రీడాకారుని పాత్రలో మెప్పించారు. క్లయిమాక్స్ లో వరదల్లో చిక్కుకున్న చిన్నారులను కాపాడే సీన్స్ లో ఆకట్టుకున్నాడు. అతనికి. జంటగా నటించిన ప్రియాంక జవాల్కర్ ముస్లిం యువతి పాత్రలో మెప్పించారు. వీధి బాలురుగా నటించిన ఇద్దరు చిన్నారులు కూడా… మొదటి నుంచి చివరి వరకు బాగా నటించారు. అతిథి పాత్రలలో నిత్యామీనన్ ఓ పాటలోనూ… రోడ్డు మీద బొమ్మలు అమ్ముకునే పాత్రలో బిత్తిరి సత్తి కనిపించి మెప్పించారు.
డెబ్యూ దర్శకురాలు అయినా సుజనా రావు… గమనం కోసం. రాసుకున్న కథ.. కథనాలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి. మహానగరంలో పేదల జీవితాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అలాగే భారీ వర్షాలు వస్తే బస్తీల్లో పేదల బతుకు ఎలా ఛిద్రం అవుతుందో బాగా చూపించారు. ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హృదయానికి హత్తుకునేలా ఉంది. ఉన్నది ఒక్క సాంగే అయినా.. దాన్ని నిత్యామీనన్ ద్వారా శాస్త్రీయ గీతంతో క్లయిమాక్స్ లో కంపోజ్ చేయడం బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3